బీసీ రిజర్వేషన్ల విచారణ వాయిదా
బీసీ రిజర్వేషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల తరపు వాదనల తరువాత .. ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. గురువారం మరికొన్ని వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. నామినేషన్ల వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది.
బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని , రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించిందని , జీవో నంబర్ 9పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు . సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తోందని , ప్రజాసంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని , బీసీ ప్రత్యేక (డెడికేటెడ్) కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచొచ్చని ఆయన విన్నవించారు . చట్టసభలు చేసిన చట్టాలను కొంతమంది గవర్నర్లు త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారని , బిల్లులను ఆమోదించడం లేదు , తిరస్కరించడం లేదు, తిప్పిపంపడం లేదని తెలిపారు . బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారని , వారి చర్యల వల్ల ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు .