Home Page SliderLifestyleNationalNewsTrending Today

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో సందడి చేసిన ఉపాసన

ఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తాతో ఒకే వేదికపై ఉపాసన కొణిదెల సందడి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ పూజలో వీరిద్దరూ పాల్గొన్నారు. తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామజస్ కాలేజీ గ్రౌండ్స్ బతుకమ్మ 2025 ఘనంగా నిర్వహించారు. ఎంట్రప్రెన్యూర్, ఫిలాంత్రఫిస్ట్ శ్రీమతి ఉపాసన కామినేని కొణిదెల ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు. దాదాపు నాలుగు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు, కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంప్రదాయ పూల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి ఉపాసన దీపప్రజ్వలన చేసి, ప్రసంగించారు. “బతుకమ్మ పూల పండుగ మాత్రమే కాదు.. ఇది మహిళా శక్తి, సమాజ బలం, సృజనాత్మకతకు ప్రతీక. విజయోత్సవం. ఢిల్లీలో యువత ఈ సంప్రదాయాన్ని ఇంత వైభవంగా కొనసాగిస్తుండటం చూడడం గర్వకారణం అన్నారు. తెలంగాణ సంస్కృతిని అంతటా వ్యాప్తి చేసి, గౌరవంగా ఆచరించినందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారికి ఉపాసన ప్రత్యేకంగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేఖా గుప్తా కూడా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఢిల్లీ తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివేక్ రెడ్డి, సలహాదారు కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సంప్రదాయ పూజ, బతుకమ్మ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఉత్సవ వైభవాన్ని మరింత పెంచాయి. దసరా పండుగ సమయంతో కలసి ఈ బతుకమ్మ వేడుక సంప్రదాయం, ఐక్యత, సాంస్కృతిని ప్రతిబింబిస్తూ, ఢిల్లీలోని తెలుగు విద్యార్థుల ఐక్యమత్యాన్ని దిల్లీ తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ మరోసారి బలోపేతం చేసింది. ముఖ్య అతిథిగా ఉపాసన కొణిదెలకు తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే శాలువా, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.