గ్రూప్-II ధృవపత్రాల పరిశీలన తేదీలు విడుదల
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-II సర్వీసెస్ (సాధారణ నియామకం) కింద వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తేదీలను ప్రకటించింది. కమిషన్ వెబ్సైట్లో ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను ఉంచింది. ధృవపత్రాల పరిశీలన సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరగనుంది. రిజర్వ్ డేగా సెప్టెంబర్ 25ను నిర్ణయించారు. ఈ పరిశీలన సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ , పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్ (పాత క్యాంపస్)లో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 22 నుండి 25 వరకు TSPSC అధికారిక వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్లు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. కాబట్టి అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నిర్ణీత తేదీల్లో ధృవపత్రాల పరిశీలనకు హాజరుకాని అభ్యర్థుల అభ్యర్థిత్వం తదుపరి ప్రక్రియలో పరిగణించబడదని TSPSC హెచ్చరించింది.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in ను సందర్శించాలని సూచించారు