Breaking NewsHome Page Sliderhome page sliderNewstelangana,Trending Todayviral

ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసిన అసమర్ధ పాలన

  • ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్
  • రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శా

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఆరు గ్యారంటీల అమలు సంగతేమో కాని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం చేసిందని విమర్శించారు. కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వ అసమర్థత మరోసారి బయటపడిందని ఎద్దేవా చేశారు.ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుడా, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకుండా అప్పులతో ఏం చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని విమర్శించారు .

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని కేటీఆర్ ఆరోపించారు. కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం పడిపోవటంతో పాటు అప్పులు భారీగా పెరిగాయని ఆక్షేపించారు. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ, ఇప్పుడు రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. పన్నేతర ఆదాయం కూడా దారుణంగా పడిపోయిందని, బడ్జెట్‌లో అంచనా వేసిన దానిలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలు అయిందని విమర్శించారు .

అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రతీ రోజూ అప్పు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఇప్పటికే రూ. 20,266 కోట్లు అప్పుగా తీసుకుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వార్షిక లక్ష్యంలో ఇది 37.5 శాతమని ఆక్షేపించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆటో-పైలట్‌లో ఉందని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.