నేతన్నలకు రుణమాఫీ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్న్యూస్ చెప్పింది. రైతులకు రుణమాఫీ తరహాలోనే ఇప్పుడు చేనేత వృత్తిలో ఉన్న వారికి కూడా ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. చేనేత కార్మికులు 2017 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి 31 వరకూ తీసుకున్న రుణాలకు (అసలు, వడ్డీతో కలిపి) మాఫీ వర్తించనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యంగా, వస్త్ర ఉత్పత్తి, నిర్వహణ, వృత్తి సంబంధిత అవసరాల కోసం తీసుకున్న వ్యక్తిగత రుణాలకు ఇది వర్తించనుంది. రూ. లక్ష వరకు రుణమాఫీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 33 కోట్లను మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ, రాష్ట్ర చేనేత సంచాలకుడు నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. వారు సిఫారసులు చేసిన తర్వాత, లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా మాఫీ మొత్తాన్ని జమ చేస్తారు. తదనంతరం, బ్యాంకులు ‘నో డ్యూస్’ సర్టిఫికేట్ జారీ చేసి, అర్హులైన వారికి తిరిగి రుణాలు మంజూరు చేస్తాయి. అయితే ప్రస్తుతం చేనేత వృత్తిలో లేని లేదా వారి ఖాతాలు ఎన్పీఏగా ఉన్నవారు ఈ ప్రయోజనం పొందలేరు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వేలాది చేనేత కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

