హైకోర్టుకు కొత్త జడ్జీలు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా మరో ఆరుగురు జడ్జీలు నియమితులయ్యారు. న్యాయవాదులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, పుల్లా కార్తీక్, కాజ శరత్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా… జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్రావు అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ గత నెలలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఆమోదం లభించడంతో ఈ నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు రోజుల్లో వీరందరూ న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం హైకోర్టులో 28 మంది న్యాయమూర్తలు ఉన్నారు. తాజా నియమాకాలతో ఈ సంఖ్య 34కు చేరింది. మరో వైపు దేశ వ్యాప్తంగా 6 హైకోర్టుల్లో 26 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో ఈ ఏడాది న్యాయమూర్తులుగా నియమితులైన వారి సంఖ్య 127కు చేరింది.