అభిమాని మృతిపై జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారంటే…
తన అభిమాని శ్యామ్ సూసైడ్ చేసుకుని మరణించడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్యామ్ రెండురోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. శ్యామ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “అమ్మానాన్న నన్ను క్షమించండి. జాబ్ చేయాలనే ఆసక్తి లేదు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని” నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నాడు. ఇతడు జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని. శ్యామ్ మరణం తననెంతో కలచివేసిందని, అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, అత్యంత బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రభుత్వ అధికారులు వెంటనే ఈ విషయంపై దర్యాప్తు జరపాలని కోరుకుంటున్నానని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఎన్టీఆర్.

టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ వర్గాలు మాత్రం శ్యామ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. శ్యామ్ మరణం వెనుక వైసీపీ ప్రమేయం ఉందంటూ ఆరోపించారు. శ్యామ్ మరణానికి కారకులను శిక్షించాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా అభిమాని మరణంపై స్పందించడం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.