బీజేపీ ఎమ్మెల్యేలకు జైలు శిక్ష.. ఇప్పటి వరకు పడని అనర్హత వేటు..
మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్సభ సెక్రటేరియట్ ఆయన ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. ఇదిలా ఉంటే.. మరోవైపు కర్ణాటకలోని ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కోర్టులో శిక్ష విధించి రెండు నెలలు దాటిపోతున్నా వారిపై ఇంత వరకు అనర్హత వేటు వేయలేదని ఇదెక్కడి న్యాయం అంటూ కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులు మంచివి కావు. మీకు ఒక న్యాయం మందికో న్యాయం ఉండే ఆస్కారం లేదని మోదీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
కాంట్రాక్టు పనుల్లో 50 లక్షల అవినీతి కేసులో నేరం రుజువుకావడంతో హావేరీ నియోజవకర్గం బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్కి రెండేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. చిక్ మగళూరు జిల్లా మూడిగెరె బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి చెక్ బౌన్స్ కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. వీరిద్దరికీ జైలు శిక్ష పడినప్పటికీ వారి శాసన సభ్యత్వాలను ఇంత వరకు రద్దు చేయలేదని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న వీరిద్దరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు.