జల్ మంత్రికి తెలంగాణా నీటి గోస
కృష్ణా, గోదావరి నది జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని, గోదావరికి సంబంధించి నికర జలాల వాటాలు తేల్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కృష్ణా నది యాజమాన్య బోర్డు పక్షపాతంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నది పరివాహకంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉందని దీని ప్రకారం న్యాయంగా కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణకే కేటాయించాలని కోరారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే టెలీమెట్రీ యంత్రాలకు అయ్యే ఖర్చు భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.దీనిపై కేబినెట్లో చర్చిస్తామని జల్ మంత్రి తెలిపారని ఉత్తమ్ వెల్లడించారు.