జగనాసుర దహనం చేద్దాం అంటూ పిలుపునిచ్చిన తె.దే.పా.
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మనం చేద్దాం జగనాసుర దహనం పేరుతో ఆ పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెదేపా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. గతంలో చేపట్టిన మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు తరహాలోనే తాజాగా మనం చేద్దాం జగనాసుర దహనం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పిలుపు మేరకు వైకాపా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ సైకో పోవాలి అని రాసిన పత్రాలను ప్రజలు, పార్టీ శ్రేణులు దహనం చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. జగన్ అనే చెడుపై చంద్రబాబు అనే మంచి సాధించబోయే విజయంగా ఈ దసరా పండుగ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ కోరింది. ఎన్టీఆర్ భవన్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రిలో లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి పాల్గొన్నారు. పలుచోట్ల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెదేపా నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.