“ఇళ్ల నిర్మాణం పై నా అక్కచెల్లెమ్మలకే ఆప్షన్లు”-జగన్
ఇల్లు నిర్మాణంపై ఏ పద్ధతిలో కట్టుకుంటారోనని అక్కచెల్లెమ్మలకే ఆప్షన్లు ఉంటాయన్నారు ఏపీ సీఎం జగన్. అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు వెంకటపాలెం గ్రామంలో జరిగిన బహిరంగ సభ నుంచి సీఎం జగన్ ప్రసంగించారు . ఈ ఆప్షన్లను ఇలా వివరించారు జగన్.
మొదటి ఆప్షన్.. ఎవరైనా సొంతంగా మేమే ఇల్లు కట్టుకుంటామని చెబితే దానికి అయ్యే ఖర్చు రూ.1.80 లక్షలు నేరుగా జమ చేస్తామని అన్నారు.
రెండో ఆప్షన్ తమ ఇంటి నిర్మాణం చేయించుకోవడానికి వారికి కావాల్సిన నిర్మాణ సామాగ్రి ప్రభుత్వమే అందజేయాలని అని కోరితే..దానికి ప్రభుత్వమే సిద్ధమేనని. నిర్మాణ కూలీ మొత్తాన్ని పనుల పురోగతి మేరకు నేరుగా జమ చేస్తామని పేర్కొన్నారు.
మూడో ఆప్షన్లో మీరే ఏదో రకంగా ఇల్లు కట్టించమని అక్కచెల్లెమ్మలు అడిగితే.. దానికి కూడా చిరునవ్వుతో మీ అన్న సరే అంటున్నాడని ఎలా కట్టుకుంటారో మీరే ఆప్షన్ ఎంచుకోండని, ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు.
ఈ ఇళ్లకు కూడా మిగతా చోట చేస్తున్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఇల్లు కడుతున్నామో అలాగే కట్టిస్తామని, ఇసుక పూర్తిగా ఉచితంగా అందజేస్తామని తెలిపారు. సిమెంట్, స్టీల్, డోర్ ప్రేమ్లు ఇతర మెటీరియల్ ప్రభుత్వమే సబ్సిడీ రేటుకు, తక్కువ రేటుకు అందిస్తుందని, ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ మొత్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చానని, ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా నవరత్నాల్లోని పథకాలు, రైతులు, అక్కచెల్లెమ్మలకు, సామాజిక వర్గాలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశానని ఉద్ఘాటించారు.