కేటీఆర్ మామ పాకల హరినాథ్ రావు కన్నుమూత.. సీఎం నివాళి
తెలంగాణ మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథ్రావు(72) గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరినాథ్… గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై మరణించారు. విషయం తెలుసుకున్న కేటీఆర్,ఆయన భార్య శైలిమ, ఇతర కుటుంబసభ్యులు హుటాహుటిన ఏఐజీ హాస్పిటల్ వెళ్లారు. అనంతరం హరినాథ్రావు మృతదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. హరినాథ్రావు పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సీఎంతో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్కుమార్, మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ కూడా నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

