జగన్, కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్లో చేరికలు..
గుంటూరు జిల్లా అధ్యక్షుడిని మార్చడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజుపై ఆ పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారయణ అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుపట్టారు. కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని అన్నారు. అధ్యక్షుల మార్పు నాతో చర్చించలేదన్నారు. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా నేను నియమించిన వాళ్లేనని వ్యాఖ్యానించారు. తను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎంతో మందిని బీజేపీలో జాయిన్ చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన వియ్యంకుడు బీఆర్ఎస్లో ఎందుకు చేరాడో వీర్రాజునే అడగాలన్నారు. జగన్, కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్లోకి ఏపీ నేతలు చేరుతున్నారని ఆరోపించారు. ఆంధ్రాలో పవన్, తెలంగాణలో బండిసంజయ్ ను వీక్ చేయాలని చూస్తున్నారని కన్నా విమర్శించారు. ఒన్షాట్ టు బర్డ్స్గా కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నారు.

