మీ సమస్యలు పవన్ కు, చంద్రబాబుకు చెప్తా: మంత్రి దుర్గేష్ హామీ
టాలీవుడ్ పరిశ్రమలో కార్మికుల సమ్మె, ఇతర సమస్యల నేపథ్యంలో పలువురు అగ్ర నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తో సోమవారం భేటీ అయ్యారు. తమ సమస్యలు విన్నవించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కావాలని మంత్రిని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ మేరకు మంత్రి దుర్గేష్ వారి సమస్యలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. “ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న పరిణామాల గురించి తెలియజేయడానికే నిర్మాతలు వచ్చారు. ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ లేదు. ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, నిర్మాతలు ఇరువురూ చెప్పే విషయాలు వింటాం. ఈ అంశంపై ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ సామరస్యంగా మాట్లాడుకోవాలి. అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తాం. ప్రభుత్వ జోక్యం అవసరమైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఏపీలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తాం. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున తప్పకుండా సహకారం అందిస్తాం” అని పేర్కొన్నారు.

