Home Page SliderNationalNews Alert

ట్రాఫిక్‌ చలానాతో దంపతుల మధ్య తగాదా.. ఫిర్యాదుతో భర్త జైలు పాలు

ట్రాఫిక్‌ చలాన్లు భార్యభర్తల మధ్య చిచ్చుపెట్టాయి. హెల్మెట్‌ లేకుండా స్కూటీపై ప్రయాణించిన ఓ వ్యక్తి బండారం బట్టబయలు కావడంతో భార్య ఆగ్రహానికి లోనైంది. భార్య ఫిర్యాదుతో భర్త జైలు పాలయ్యాడు.

అసలు ఏం జరిగింది..?

హెల్మెట్‌ లేకుండా ప్రయాణించినందుకు కేరళ ట్రాఫిక్‌ పోలీసులు ఆ వ్యక్తికి జరిమానా విధించారు. సీసీటీవీ కెమెరాకు చిక్కిన అతడి ఫోటోను కూడా పంపించారు. స్కూటీ భార్య పేర రిజిస్టర్‌ అయి ఉండటంతో ఈ జరిమానా వివరాలు, భర్త ఫోటో అతడి భార్యకు అందాయి. అయితే.. ఆ ఫోటోల్లో భర్త మరో మహిళతో కలిసి ప్రయాణించడం ఆమె కంట పడింది. ఈ విషయంపై ఆమె అతడిని నిలదీసింది. కానీ,తాను ఏ తప్పూ చేయలేదని అతడు భార్యకు వివరణ ఇచ్చాడు. దారిన పోయే మహిళకు తాను లిఫ్ట్‌ మాత్రమే ఇచ్చానని అన్నాడు. కానీ .. అతడు చెప్పిన మాటలకు ఆమె నమ్మలేదు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు మే 5న భర్తపై ఆమె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై భర్త దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్తను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతడికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో అతడు నేరస్థుడిగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.