ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నిందితులకు ఏసీబీ నోటీసులు..
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ తో సహా ఈడీ అధికారులు విచారణను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఫార్ములా ఈ కారు రేస్ కంపెనీలు, రూ.55 కోట్ల లావాదేవీలు, స్పాన్సర్షిప్ కంపెనీల వివరాలను సైతం ఏసీబీ సేకరించింది. ఈ మేరకు కేసులో కీలక నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ , హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డికి నేడు లేదా రేపు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ-కారు రేస్ నిర్వహణలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే, కేసులో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేరును అధికారులు A1గా చేర్చారు. ఈ క్రమంలో తనపై నమోదైన ఎఫ్ ఐఆర్ ను కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఈ కేసు వేగవంతం కావడంతో బీఆర్ఎస్ పార్టీలో అలజడి స్టార్ట్ అయింది.. ఏ క్షణం ఏమవుతుందోనని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.

