ఈడీ ఉచ్చులో సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి మెడకు మరింత బలంగా ఈడీ కేసు ఉచ్చు బిగుసుకుంది. తెలంగాణో దాదాపు పదేళ్ల క్రితం వెలుగు చూసిన ఓటుకు నోటు కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాత్రపై ఆధారాలు ఉన్నాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని.. కోర్టుకు ఆధారాలు సమర్పించేందుకు ఈడీ సిద్ధమైంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ఛార్జిషిట్లో ఏ1 నిందితుడిగా ఉన్న రేవంత్ 2019 లో విచారణలో తప్పించుకున్నారని ఈడీ చెబుతోంది. రేవంత్ 50 లక్షల రూపాయల మనీ లాండరింగ్కు పాల్పడ్డట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. స్టీఫెన్సన్ను కలిసి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటు వేసేలా బేరం మాట్లాడమని తనని రేవంత్ పంపాడని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో మరో ముద్దాయి ముత్తయ్య పేర్కొన్నారు. స్టీఫెన్సన్ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేస్తే రూ. 5 కోట్లు, ఓటింగ్లో పాల్గొనకుంటే రూ. 3 కోట్లతో పాటు జెరూసలేంకు ఫ్లైట్ టికెట్ ఖర్చు భరిస్తానని రేవంత్ తనకి చెప్పినట్లు ముత్తయ్య ఒప్పుకున్నాడు. అయితే.. ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జడ్జీ లీవ్ లో ఉండటంతో నాంపల్లి కోర్టు తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. ఇవాళ కోర్టు విచారణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఆయన ఇతర పనులరీత్యా హాజరుకాలేకపోయారు.

