Home Page SliderTelangana

పదివేల మంది మహిళలతో సద్దుల బతుకమ్మ

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై దాదాపు పదివేల మంది  మహిళలచే ఈనెల 10 వతేదీన సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేశారు. 10వ తేదీన నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల పై నేడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగాగల అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో  ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఈ సందర్బంగా, బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్ లనుండి ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్, లేజర్ షో ల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుండి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశమున్నందున వారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా, ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్ లోఉన్న బతుకమ్మ ఘాట్ తోపాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మ ల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ ఎంసీ అధికారులను కోరారు. సాయంత్రం 5 .30 నుండి 7 .30 గంటల మధ్య ట్యాంకు బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందున ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు.