2014లోనే పాత ఫోన్ను పక్కన పెట్టారని చెప్పిన ప్రధాని మోడీ
కేవలం 2014 సంవత్సరం మాత్రమే కాదని, అదో మార్పు అని ప్రధాని మోడీ అన్నారు. ఆ మార్పు కోసమే ఔట్డేటెడ్ ఫోన్ లాంటి కాంగ్రెస్ను ప్రజలు వదిలించుకున్నారని మోడీ చురకలు వేశారు.
ఢిల్లీ: ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీని కాలం చెల్లిన ఫోన్తో పోల్చుతూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 2014లోనే ప్రజలు ఆ ఫోన్లను వదిలేసి.. దేశ గతిని మార్చే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారన్నారు. కాలం చెల్లిన ఫోన్లలో స్తంభించిన స్క్రీన్లపై.. ఎన్నిసార్లు స్వైప్ చేసినా, ఎన్ని బటన్లు ప్రెస్ చేసినా ఫలితం ఉండేది కాదు. రీస్టార్ట్ చేసినా, బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టినా.. చివరకు బ్యాటరీ మార్చినా ఆ ఫోన్లు పనిచేసేవి కావు. గత ప్రభుత్వం కూడా అలాంటి స్థితిలోనే ఉండేది. 2014 లోనే ప్రజలు అలాంటి కాలం చెల్లిన ఫోన్లను వదిలించుకున్నారు. ఈ దేశానికి సేవ చేసేందుకు మాకు అవకాశం కల్పించారు. 2014 కేవలం తేదీ మాత్రమే కాదు. అదో పెనుమార్పు అని మోడీ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా సాంకేతిక రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రధాని గుర్తు చేశారు. వేగవంతమైన 5జీ టెలిఫోన్ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత.. ఇప్పుడు 6జీ దిశగా భారత్ వడివడిగా పరుగులు తీస్తోంది. 5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడాదిలోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. బ్రాడ్బ్యాండ్ వేగంలో భారత్ గతంలో 118 ర్యాంక్లో ఉండగా.. ఇప్పుడు 43వ ర్యాంక్కు తగ్గింది. ఇటీవలే గూగుల్.. భారత్లో పిక్సెల్ ఫోన్ను తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. శామ్సంగ్ ఫోల్డ్ 5, యాపిల్ ఐఫోన్ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం గర్వంగా ఉందని మోదీ అన్నారు. భారత్ టెక్ విప్లవంలో యువత పాత్ర కీలకమని మోడీ అన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. గతంలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ నెమరువేసుకోవాలి. మా హయాంలో 4జీని విస్తరించాం. కానీ మాపై ఒక్క మచ్చా లేదని కాంగ్రెస్ పార్టీని ప్రధాని ఎద్దేవా చేశారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తుందని మోడీ విశ్వసిస్తున్నారు.