ఏ రంగంలోనైనా ఆత్మ సంతృప్తి ముఖ్యం..
మనిషి ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా… తన మూలాలు, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. గ్రామమైనా, ఏజెన్సీ ప్రాంతమైనా సొంత సంస్కృతిని చూసి గర్వపడాలన్నారు. హైదరాబాద్లోని నారాయణగూడ కేశవ్ మెమోరియల్ను రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో పలు అంశాలపై ముచ్చటించారు. ఏ రంగంలోనైనా ఆత్మ సంతృప్తి చాలా ముఖ్యమైందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. మన రాజ్యాంగం మహిళలకు అనేక అవకాశాలు కల్పించిందని.. తల్లిదండ్రులు చిన్నతనం నుండే పిల్లలకు విలువల గురించి నేర్పించాలని కోరారు. అన్ని విషయాల్లో అమెరికాతో పోల్చుకోవద్దని. భారత్లో ఉన్న జనాభా అమెరికాలో లేదన్నారు. భారత్లో ఉన్నన్ని కులాలు, భాషలు, వైవిధ్యం అమెరికాలోని లేవని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్ పలువురు నాయకులు పాల్గొన్నారు.

