నయా నిజాం తరహలో కేసీఆర్ పాలన : అసోం సీఎం
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వనం మేరకు తెలంగాణ పర్యటనకు వచ్చిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ… టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 30 ఏళ్ల దాకా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుందన్న ఆయన… కేంద్రంలో విపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల నెరవేరదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయన్న హిమంత బిశ్వ శర్మ… సీఎం కేసీఆర్ కొత్తగా ఎవరిని ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు. నయా నిజాం తరహలో కేసీఆర్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని గ్రహించిన తర్వాతే జాతీయ రాజకీయాలంటూ తిరుగుతున్నారన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన తప్ప అభివృద్ధి లేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయాలని, లేదంటే ఆయన ఎక్కడ తిరిగినా గౌరవం లభించదని హితవు పలికారు. సీబీఐ, ఈడీల గురించి మాట్లాడేవారికి అవి అంటే భయముందని శర్మ అన్నారు

