‘శీష్ మహల్ పార్ట్-2’పైరాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు!
‘శీష్ మహల్ పార్ట్-2’ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ నూతన విలాసవంతమైన నివాసమని రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సామాన్యుడిలా బతుకుతానని చెప్పిన నాయకులు, నేడు రాజభవనాల్లో విలాసవంతమైన జీవితం గడపడం చూసి అసహ్యమేసి తాము పార్టీని వీడామని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ కొత్త నివాసం (95 లోధీ ఎస్టేట్) కి సంబంధించిన అత్యంత విలాసవంతమైన చిత్రాలు బయటకు వచ్చాయని, దీంతో పార్టీ విధానాలపై నిరాశతోనే ఏడుగురు ఎంపీలం ఏకతాటిపైకి వచ్చి బీజేపీలో చేరామని ఆయన వెల్లడించారు. అవినీతి, అరాచక శక్తుల నుంచి విముక్తి పొందేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చద్దా పునరుద్ఘాటించారు. మరోవైపు ఆప్ నేత అతిషీ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.

