నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదు
- మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం
భారత ఆల్రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో బెంచ్కే పరిమితమవ్వడం పెద్ద చర్చనీయాంశమైంది. అతన్ని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ టీమ్ మేనేజ్మెంట్ను తీవ్రంగా విమర్శించాడు. జట్టు ఎంపికలోనే స్పష్టమైన లోపాలు ఉన్నట్టు వ్యాఖ్యానిస్తూ, ప్లేయింగ్ 11లో చోటు ఇవ్వకపోతే అతన్ని ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు. హార్దిక్ పాండ్యా లేని సందర్భంలో నితీశ్ను తప్పనిసరిగా తుది జట్టులో పెట్టాల్సిందని, హార్దిక్ చేయగల పనిని నితీశ్ కూడా చేయగల సామర్థ్యం ఉందని అశ్విన్ స్పష్టం చేశాడు. యువ ఆటగాడు మరింత మెరుగయ్యే అవకాశం ఉన్నప్పుడు అతన్ని బెంచ్లో కూర్చోపెట్టడం తగదని అభిప్రాయపడ్డాడు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్లను ప్రశంసించిన అశ్విన్, ప్రస్తుతం భారత జట్టు చూపిస్తున్న దూకుడు బ్యాటింగ్కు కారణం వారిద్దరేనని పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్ ఆధునిక ఆగ్రెసివ్ బ్యాటింగ్కు దిశా నిర్దేశం చేయగా, రోహిత్ శర్మ అదే మార్గాన్ని జట్టుకు చూపించి అమలు చేశాడని అభిప్రాయపడ్డాడు. వైట్బాల్ క్రికెట్లో ఇప్పుడు సగటు కాదు, స్ట్రైక్రేటే ప్రధానమైందని తెలిపాడు.

