Breaking NewsHome Page Sliderhome page sliderInternationalNewsPolitics

చైనా ఎగుమతులపై అమెరికా 100 శాతం టారిఫ్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా దిగుమతులపై మరోమారు సుంకాల బాంబు పేల్చారు. అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నామని ప్రకటించారు. అన్ని కీలక సాఫ్ట్ వేర్ ఎగుమతులపైనా ఆంక్షలు విధించారు. ఈ పరిణామాలతో అమెరికా స్టాక్‌ మార్కెట్లకే నష్టమయ్యింది. అమెరికా మార్కెట్లలో 1.5 ట్రిలియన్‌ డాలర్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది. మార్కెట్లు ముగిసే సమయానికి నాస్‌ డాక్‌ 3.56 శాతం, డోజోన్స్‌ 1.90శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 2.71శాతం మేర నష్టపోయాయి.
అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన ట్రంప్ భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటలకే ట్రంప్‌ సుంకాల ప్రకటన చేయడం గమనార్హం. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం నడుస్తుందనే భయాలు నెలకొన్నాయి. దాంతో అమెరికా మదుపర్ల సంపద 1.5 ట్రిలియన్ డాలర్ల మేర ఆవిరవగా.. క్రిప్టో మార్కెట్‌ లో 19 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు చోటుచేసుకున్నాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదు.
చైనా తయారీ వస్తువులు ఏ దేశం నుంచి దిగుమతి అయినా.. చైనా ఏ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసినా ఈ సుంకం వర్తిస్తుంది. నవంబర్ ఒకటి లేదా అంతకంటే ముందే ఈ టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయని ట్రంప్ హెచ్చరించారు. దీనితో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలయినట్లు తెలుస్తోంది.