ఈ రాకెట్ ప్రయోగంతో మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్
ఇస్రో త్వరలో ప్రయోగించే సీఎంఎస్-02 ఉపగ్రహం ద్వారా భారత దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సమస్యను తీర్చబోతోంది. కొండల్లో, కొనల్లో, దట్టమైన అడవి ప్రాంతాల్లో కూడా సరికొత్త టెక్నాలజీతో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ సీఎంఎస్ ఉపగ్రహం దోహదపడుతుంది. బాహుబలి రాకెట్గా పేరుగాంచిన LVM-4 రాకెట్ ద్వారా అమెరికాలో తయారైన ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్దమవుతోంది. ఇప్పటికే కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోట నుండి ఎన్నో కమ్యూనికేషన్ ఉపగ్రహాలను నింగికి పంపి ఘన విజయం సాధించారు. అయితే ఈ ప్రయోగం కమ్యూనికేషన్ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశలో ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఎల్వీఎం-3ఎం మార్క్-5ను వచ్చేనెల రెండో వారంలో ఈ ప్రయోగం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. షార్ లో రాకెట్ అనుసంథానం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా 6,500 కిలోల బరువైన బ్లాక్-2 బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. ఈ నెలాఖరులోగా ఉప గ్రహం భారత్ కు చేరుకోనుంది. ఈ ప్రయోగం ద్వారా స్మార్ట్ ఫోన్ కు ప్రత్యక్ష అనుసంధానం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ వినియోగదారులు భూమిపై ఉండే టవర్ల మీద ఆధార పడకుండా నేరుగా కాల్స్ చేసుకోవడానికి.. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ఎల్వీఎం-3ఎం మార్క్-5 రాకెట్ ప్రయోగాన్ని అక్టోబర్ మాసంలో ఏ రోజున ప్రయోగించే తేదీని ఇస్రో శాస్త్రవేత్తలు ఖరారు చేయాల్సి ఉంది.