ఏపీ 3S విధానంపై లోకేష్
దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సియోల్లో ఆ దేశ విదేశాంగ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై చర్చించారు.
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక- రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ సప్లయ్ చైన్కు ఆంధ్రప్రదేశ్ సురక్షితమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని లోకేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 3S (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా ఉంటుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక పన్ను రాయితీలు, తక్కువ ధరకు భూమి, వివిధ సబ్సిడీలు, సింగిల్ విండో విధానం ద్వారా వేగవంతమైన అనుమతులు అందిస్తున్నామని చెప్పారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా కంపెనీలు ఏపీని ప్రాధాన్య గమ్యస్థానంగా ఎంచుకునేలా ప్రోత్సహించాలని కోరారు.
ఆటోమొబైల్ రంగంతో పాటు గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్, వినియోగ వస్తువుల తయారీ, మోడరన్ రిటైల్, టూరిజం వంటి రంగాల్లో కూడా కొరియా పెట్టుబడులను ఏపీ ప్రభుత్వం స్వాగతిస్తోందని లోకేష్ తెలిపారు.
లోకేష్ ప్రతిపాదనలపై సిసిలియా చుంగ్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక విధానాలు కొరియా కంపెనీలకు మంచి అవకాశాలను కల్పిస్తాయని, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

