పేలిన ఎలక్ట్రికల్ బైకులు
గడచిన రెండు నెలల వ్యవధిలో దాదాపు అరడజనుగా పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ పెడుతుంటే బాంబులై పేలుతున్నాయి. తాజాగా హైదరాబాద్లోని కుషాయిగూడలో ఛార్జింగ్ పెట్టిన రెండు ఎలక్ట్రికల్ బైకులు పేలాయి. వనగట్ల హరిబాబు కుషాయిగూడ సాయినగర్ కాలనీలో ఉంటున్నారు. తన ఎలక్ట్రికల్ బైకులకు పార్కింగ్ ఏరియాలో ఛార్జింగ్ పెట్టాడు. పెట్టిన ఒక గంట వ్యవధిలో ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. తీరా చూస్తే తన రెండు బైకులు మంటలంటుకుని అగ్నికి ఆహుతయ్యాయి. ఎలక్ట్రికల్ బైక్ల వినియోగం పెరుగుతున్న క్రమంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు కంపెనీలు మాత్రం సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా బైకులను తయారీ చేస్తున్నామని చెప్తున్నాయి. కొత్తగా విడుదల చేయబోయే ఎలక్ట్రిక్ వాహనాలను తక్షణమే నిలుపుదల చేయాలని గతంలో కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా పలు మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.