పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీల వైఎస్ జగన్ దిశానిర్దేశం
రాష్ట్రంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యమేస్తోందన్నారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శకుని పాచికలు మాదిరిగా ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చాయనిపిస్తోందన్నారు. ఏం జరిగిందో దేవుడికే తెలియాలన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోకూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికిందన్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని సభ సాక్షిగా ప్రశంసలు కురిపించిందన్నారు. కాని, సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను ఒక భూతంలా చూపి… టీడీపీ, కూటమి పార్టీలు విషప్రచారం చేశాయన్నారు. జంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే.. అంత సులభమైన విషయం కాదని, వైయస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలమంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయన్నారు. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా.. మోసాలకు ఎలాంటి ఆస్కారం లేని పరిస్థితులు ఈ చట్టంవల్ల వస్తాయన్నారు. చరిత్రలో తొలిసారిగా భూ పత్రాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్నారు. ఈ పత్రాల విషయంలో తప్పులు జరిగితే… సదరు వ్యక్తికి ప్రభుత్వమే పరిహారం ఇస్తుందన్నారు. టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారు. వారి చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిబట్టే తెలుస్తుందన్నారు జగన్.

వైయస్సార్సీపీని నమ్మకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయని, కొన్ని లక్షలమంది కార్యకర్తలు ఈ పార్టీపై ఆధారపడి ఉన్నారన్నారు. కొన్ని వేలమంది నాయకులు పార్టీలో ఉన్నారని, అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో మనకు 40శాతం ఓట్లు వచ్చాయన్న జగన్, గడచిన ఎన్నికలతో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయన్నారు. రానున్న రోజుల్లో ఈ 10శాతం ప్రజలే… మన పాలనకు, ఇప్పటి ప్రభుత్వం పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నారు. ప్రతి ఇంట్లోకూడా మన ప్రభుత్వం చేసిన మంచి ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదన్న జగన్, మనలో పోరాటపటిమ తగ్గకూడదన్నారు. నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఇంకా తగ్గలేదన్న జగన్, 14 నెలలు పాదయాత్ర చేశాను, దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందన్నారు. ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకు వస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నారు. పార్లమెంటులో మనకు 11 మంది రాజ్యసభ సభ్యులు, 4గురు లోక్సభ సభ్యులు ఉన్నారని, మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారని, టీడీపీకి 16 మంది ఉన్నారని, అందువల్ల మన పార్టీకూడా చాలా బలమైనదే. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు. మనం ధైర్యంగా ఉండి ప్రజల తరఫున పోరాటంచేయాలన్నారు. 2019-24 మధ్య ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు మన పరిపాలనాకాలం ముగిసిందో అర్థం కావడం లేదని, ఈసారికూడా అంతే. ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయన్నారు.

పార్లమెంటులో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలన్నారు వైఎస్ జగన్. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగానే మద్దతు ఉంటుందన్నారు. ఎవరికైనాగాని, అంశాలవారీగానే మద్దతు ఉంటుందన్నారు. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలన్నారు. ప్రజలముందు తలెత్తుకునేలా పార్లమెంటులో ఎంపీలు ముందుకుసాగాలని, రాజకీయంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమనన్నారు. మన పరిపాలనను, చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. కచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నారు. ఈలోగా మనం ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు, విశ్వసనీయతతో ముందడుగులు వేయాలన్నారు. ఇదివరకటి లాగానే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని, లోక్సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారన్నారు.

తాను అందరికీ అందుబాటులో ఉంటానన్న జగన్, ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలన్నారు. పార్టీపరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని, నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎంపీలుగా మీరు వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిగా ఉండాలన్నారు. మన పార్టీకి ఒక సిద్ధాంతం, గుర్తింపు ఉన్నాయన్నారు. పార్టీకోసం మీరు కష్టపడండి. పార్టీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుందన్నారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించామన్నారు. మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశామన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడూ చూడని సంస్కరణలు తీసుకొచ్చామన్న జగన్, ప్రజల ఇంటివద్దకే పరిపాలనను తీసుకెళ్లామన్నారు. సోషల్ ఇంజినీరింగ్లో భాగంగా ఎప్పుడూ చూడవిధంగా వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశాలు కల్పించాం.

