స్థానిక సంస్థల ఎన్నికలలో గులాబీ జెండా ఎగరేస్తాం
స్థానిక సంస్థల ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు . స్థానిక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వానికి బుద్ధిచెపుతామని చెప్పారు . తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో టీటీడీపీ నేత ప్రదీప్ చౌదరి బీఆర్ఎస్లో చేరారు . గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లడుతూ , 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేదని తెలిపారు .
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ కార్డుల తో చేసిన మోసాలను గుర్తుచేసేందుకు తాము ‘బాకీ కార్డులను’ తీసుకెళ్తున్నామని తెలిపారు. బాకీ కార్డుతో కాంగ్రెస్ ప్రతి వర్గానికి ఎంత బాకీ పడిందో ఇంటింటికీ వెళ్లి గుర్తు చేస్తామని వివరించారు. కాంగ్రెస్ ‘బాకీ కార్డులు’ బీఆర్ఎస్కు బ్రహ్మాస్త్రమని చెప్పారు . రేవంత్రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా ఎందుకు కట్టలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సిటీ రోడ్లను కూడా కనీసం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బీఆర్ఎస్ను గెలిపిస్తారన్న నమ్మకముందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులకు క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు . మహిళలకు ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు . రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిలాగా సీఎం రేవంత్రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదు కానీ.. కొత్త నగరాన్ని కడతానని రేవంత్రెడ్డి గప్పాలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. నగరంలో కనీసం మోరీలు శుభ్రపరిచే పరిస్థితి లేదని, వీధి దీపాలు వెలిగించే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. ఒకప్పుడు తెలుగువారు దేశంలో ఉన్నారని ఎన్టీఆర్ నిరూపిస్తే.. దేశంలో తెలంగాణ వారున్నారని కేసీఆర్ నిరూపించారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.