NewsNews AlertTelangana

నేడు స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తెలంగాణాకు చెందిన పోరాట యోధుల వారసులను, అంతర్జాతీయ పోటీల్లో ఇటీవల పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను, ఇతర ప్రముఖులను సీఎం సన్మానిస్తారు. సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్‌ మహదేవన్‌ గాత్ర కచేరి, శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజారెడ్డి బృందంతో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వార్సి బ్రదర్స్‌ ఖవ్యాలీ, స్థానిక కళాకారులతో ప్రదర్శనలు నిర్వహిస్తారు.

వివిధ కార్యక్రమాలతో కూడిన వీడియో ప్రదర్శన కూడా ఉంటుంది. లేజర్‌ షో, బాణసంచా ప్రదర్శనతో వజ్రోత్సవాలను ముగిస్తారు.ఈ కార్రక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల, ట్రస్టు బోర్డుల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు అన్ని జిల్లాలకు చెందిన 30 వేల మంది హాజరవుతారని అధికారులు తెలిపారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు

వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం ముగింపు సభకు భారీ స్థాయిలో ప్రజలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. చాపెల్‌ రోడ్డు, నాంపల్లి నుంచి జేజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ బంకు వద్ద దారి మళ్లించి పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నుంచి అనుమతిస్తారు. గన్‌ఫౌండ్రీ, ఎస్‌బీఐ నుంచి.. ప్రెస్‌క్లబ్‌, బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎస్బీఐ వద్ద దారి మళ్లించి.. చాపెల్‌ రోడ్డు మీదుగా పంపిస్తారు. రవీంద్రభారతి, హిల్‌ ఫోర్ట్‌ రోడ్డు నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా దారి మళ్లిస్తారు.

నారాయణగూడ సిమెట్రీ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద దారి మళ్లించి హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ నుంచి పంపిస్తారు. కింగ్‌కోఠి, బొగ్గులకుంట నుంచి బషీర్‌బాగ్‌, భారతీయ విద్యాభవన్‌ మీదుగా వెళ్లే వాహనాలను కింగ్‌కోఠి క్రాస్‌రోడ్డు వద్ద దారి మళ్లించి.. తాజ్‌మహల్‌ హోటల్‌, ఈడెన్‌ గార్డెన్‌ మీదుగా పంపిస్తారు. బషీర్‌బాగ్‌ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్‌ వద్ద దారి మళ్లించి లిబర్టీ మీదుగా పంపిస్తారు. హిమాయత్‌నగర్‌ నుంచి బహీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వద్ద దారి మళ్లిస్తారు.