ధరాలి ఘోర ప్రమాదానికి అసలు కారణం ఇదే
- ధరాలి ఘోర విపత్తు
- విపత్తుకు కారణం వాతావరణ మార్పులే
- కరుగుతున్న హిమనీనదాలు
- ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యమవుతున్న సహాయక చర్యలు
- శిథిలాల కింద 150 మంది
- ఇప్పటి వరకూ 400 మందిని రక్షించారు.
- రోడ్డు రవాణా దెబ్బతినడంతో హెలికాఫ్టర్ల సేవలు
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామంలోని ఘోర విపత్తుకు కారణం మేఘాల విస్ఫోటనం కాదని, అసలు కారణం వాతావరణంలోని మార్పులేనని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఉత్తరకాశీ జిల్లాలో హర్సిల్ సమీపంలో ఉన్న అందమైన ధరాలి గ్రామంలో మంగళవారం రోజంతా కేవలం 2.7 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. ఇది సాధారణమే. అయినప్పటికీ భయంకర విధ్వంసం సంభవించింది. ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో విరిగిపడిన కొండచరియల శిథిలాలు గ్రామాన్ని ముంచెత్తి వినాశనం సృష్టించాయి. దీనికి కారణం ట్రాన్స్ హిమాలయాలలో ఉష్ణోగ్రత నిరంతరం పెరగడం వల్ల.. పైన ఉన్న వేలాడుతున్న హిమానీనదాలు కరుగుతున్నాయి. ఈ హిమానీనదాలు ఏటవాలులలోనే ఉంటాయి. శ్రీఖండ్ పర్వతంపై కూడా ఇటువంటి హిమానీనదాలు ఉన్నాయి. వర్షం, తేమ కారణంగా హిమానీనదంలో ఎక్కువ భాగం విరిగి పడిపోయే అవకాశం ఉంది. ఇది ముందుకు కదిలి పైన ఉన్న 2-3 సరస్సులను విచ్ఛిన్నం చేస్తుంది. అందుకే పర్వతం ముక్కలు అంత వేగంతో ప్రవహించి ధరాలికి చేరుకున్నాయని ప్రముఖ జియాలజిస్ట్ పేర్కొన్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో టన్నుల కొద్దీ శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నిరంతర కురిసిన వర్షంలోనే ఐటీబీపీ, ఆర్మీ మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ శిధిలాలలో కూరుకుపోయిన వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. ఈ హిమపాతంలో సహాయక చర్యలలో ఆర్మీ ఐబెక్స్ బ్రిగేడ్, తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతకడానికి భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ , స్నిఫర్ కుక్కల సహాయం తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ధరాలి గ్రామంలో వరదల కారణంగా 30 నుంచి 50 అడుగుల వరకు శిథిలాలు పేరుకుపోయాయి. శిథిలాల కింద ఇంకా 150 మంది చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు 400 మందిని రక్షించారు. అలాగే తప్పిపోయిన 11 మంది ఆర్మీ సైనికులను కూడా రక్షించారు. హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ బృందాలను ధరాలికి తరలించారు. చెడు వాతావరణం కారణంగా రెండు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే గురువారం ఉదయం వాతావరణం కూడా సహకరించింది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో మరోసారి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించబడింది. అయితే, హిమానీనదాలు పదేపదే విరిగిపోతున్నాయి. శిథిలాలు కూడా కిందకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రాణాలను కాపాడాలనే ఆశతో ఉత్తరకాశిలోని ధరాలి గ్రామంలో మహా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉత్తరకాశిలో వాతావరణం కూడా ఇప్పుడు రెస్క్యూ సిబ్బందికి సహకరించడం ప్రారంభించింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో గురువారం ఉదయం నుండే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. అయితే ఈ మొత్తం రెస్క్యూ ఇప్పుడు హెలికాప్టర్ సేవపై ఆధారపడి ఉంది. బాధిత ప్రజలను తరలించే ఆపరేషన్ కొనసాగుతోంది. 11 మంది సైనికులు సహా 13 మందిని విమానంలో తరలించారు. 400 మందిని రక్షించారు.

