పదేళ్లలో అతిపెద్ద జోక్ ఇదే : మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. తాజాగా నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. వ్యవసాయ మోటర్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్ల పెట్టేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం అనేదే.. ఈ పది సంవత్సరాల్లో అతిపెద్ద జోక్ అని కేంద్ర పర్యటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉట్టికి ఎగరలేనోడు.. ఆకాశానికి ఎగిరాడట. దళితులను దగా చేసిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. ప్రధాని మోడీపై కల్వకుంట్ల కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తోంది అన్నారు. దేశంలో కుటుంబ పాలన తేవాలని, కుటుంబ పార్టీలన్నిటిని కలిపే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలన చేయడమే ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసు అన్నారు. ఎన్డీఏకు ఎప్పటికీ కేసీఆర్ ప్రత్యామ్నాయం కానే కాడు అన్నారు. కేసీఆర్ కు ఉన్నదే 7 సీట్లు.. ఇక కేసీఆర్ ఏం చేస్తాడో మీరే ఆలోచించండి అన్నారు. వచ్చే ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాల్లో కేసీఆర్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, గల్లి నుంచి ఢిల్లీ వరకు 130 కోట్ల మంది ప్రజలతో జాతీయ జెండాను ఎగరవేసిన చరిత్ర బీజేపీది , ప్రధాని నరేంద్ర మోడీది అన్నారు.

కేసీఆర్ ది అతిపెద్ద అవినీతి కుటుంబం, అవినీతి, నియంతృత్వ పాలన అన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే… అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ ఎక్కువ రోజులు ఉంటే ఉద్యోగులు ఎవరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, ఈ ప్రభుత్వం ట్రాన్స్ కో, జెన్కో లకు రూ.40వేల కోట్లు అప్పు ఉందని ఆయన వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టదు అంటూ ఆయన స్పష్టం చేశారు. తప్పకుండా కేసీఆర్ అవినీతికి మీటర్లు పెడుతుంది అన్నారు. కేసిఆర్ ఏం చేశాడని దేశవ్యాప్తంగా కేసీఆర్ పాలన కావాలి?, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు, దళితులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ ఏమైంది?, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా… మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. కేజీ టూ పీజీ హామీ ఏమైంది?, సంక్షేమ హాస్టల్లో రాళ్లతో అన్నం పెడుతున్నారు… కలుషిత ఆహారం తిని విద్యార్థులు మరణిస్తున్న ఘటనలను చూస్తున్నాం, మజ్లిస్ కు, ఓవైసీకి భయపడే పార్టీ కాదు బీజేపీ అన్నారు. లక్ష మంది కేసీఆర్ లు, లక్ష మంది ఓవైసీలు వచ్చినా… 2024లో వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని విశ్వాసం వ్యక్తం చేశారు.. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని పేర్కొన్నారు కిషన్ రెడ్డి.

