Home Page SliderTelangana

“ఇది మామూలు విజయం కాదు”…ఈటల

బీజేపీ పార్టీది సాధారణ విజయం కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వారు కేవలం 99 సీట్లు గెలిచి, 240 సీట్లు సాధించిన బీజేపీ పార్టీని కూటమి ప్రభుత్వం అంటూ హేళన చేస్తున్నారు. కేవలం 3 పార్టీలతోనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. కానీ పదుల సంఖ్యలో  పార్టీల కూటమిని కూడగట్టుకుని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. దేశంలోనే అతిపెద్ద నియోజక వర్గం మల్కాజిగిరిలో ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన ఈటల రాజేందర్‌కు కుత్భుల్లాపూర్‌లో అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మల్కాజిగిరి ప్రజలు పార్టీలతో సంబంధం లేకుండా అనేక వర్గాల వారు ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చారు. వారందరికీ నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. దాదాపు నాలుగు లక్షల మెజారిటీని నాకు ఎంతో ఇష్టంతో,విశ్వాసంతో కట్టబెట్టారు. దానిని నిలబెట్టుకుంటానని హామీ ఇస్తున్నాను.

మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో  ప్రతీ ఎన్నికకూ ప్రభుత్వాలు, పార్టీలు మారుతున్నాయి. అంటే ప్రజలు ఐదేళ్ల కన్నా ఏ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. ఈ దేశంలో ఎక్కడా పదేళ్ల కంటే ఒకే పార్టీ పాలించలేదని వారు గుర్తు పెట్టుకోవాలి. సంకీర్ణ రాజకీయాల కాలంలో ఎవరు ఎప్పుడు పార్టీ మారతారో తెలియని ఈ కాలంలో ప్రజలు ప్రధాని మోదీకి మరోసారి అవకాశం ఇచ్చారు. అధికార కాంగ్రెస్ పార్టీ మద్యం, డబ్బు పంచి ఓట్ల శాతాన్ని పెంచుకుంది. ఏ ఎన్నికలు వచ్చినా మా కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలని సూచిస్తున్నాను. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఎలా కొట్లాడుతామో సర్పంచ్, పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా అలాగే కొట్లాడుతామని మనవి చేస్తున్నాను. పాత,కొత్త నాయకులను ఎవరికీ తక్కువ కాకుండా సమన్వయం చేస్తుంది బీజేపీ పార్టీ. ఏ రాష్ట్రం కూడా ఎవరి జాగీరు కాదు. ఎప్పటికీ ప్రజలదే ప్రభుత్వం. ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. కొనుక్కుంటే, మద్యం పంచితే గెలుపు సాధ్యం కాదని ఈ ఎన్నికలు నిరూపించాయి. గుడిసెలో ఉండే వారికీ, బంగళాలో ఉండే వారికీ ఒకే ఓటు ఉంటుంది. ఈ పార్లమెంటు అతిపెద్ద నియోజక వర్గం. సికింద్రాబాద్, మల్కాజిగిరిలో ఎంపీ సీట్లు సాధించి మహానగరంలో బీజేపీని గెలిపించారు తెలంగాణ ప్రజలు. అందుకే తెలంగాణకు కావలసిన సమస్త సదుపాయాలను తప్పకుండా ప్రభుత్వాలతో కొట్లాడి తీసుకువస్తామని మాట ఇస్తున్నాను. . రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లేకపోతే అతి తక్కువ కాలంలో తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు. మీరిచ్చిన అధికారాన్ని, మీ కోసమే ఉపయోగిస్తానని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని మనవి చేస్తున్నాను”. అని పేర్కొన్నారు.