Breaking NewsHome Page Sliderhome page slidermoviesNationalNews Alert

ఏపీపీఎస్సీలో ఈ పోస్టులన్నింటికీ ఒకే పరీక్ష

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబందించి పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల విషయంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రిలిమ్స్‌ పరీక్షను తొలగించి, ఒకే పరీక్ష విధానాన్ని అనుసరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జారీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. గతంలో ప్రభుత్వం జారీచేసిన జీఓ 39 ప్రకారంఒక పోస్టుకు వచ్చిన దరఖాస్తులు 200 దాటితే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించేవారు. కానీ.. తాజా నిర్ణయంతో పలు పరీక్షలకు జారీ చేసిన నోటిఫికేషన్‌ లో ఇచ్చిన పోస్టుల సంఖ్యకు 200 రెట్లు దరఖాస్తులు దాటితేనే ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి ఫిల్టర్‌ చేయనున్నారు. దీనిపై కమిషన్‌ తీర్మానం చేసిన అనంతరమే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా తమకు అధికారాన్ని కల్పించాలని ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ కమిషన్‌ ను కోరింది. ఈ మేరకు కమిషన్‌ ప్రతిపాదనలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూపు 1, గ్రూపు 2 వంటి పోస్టులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఇవికాకుండా మిగిలిన అన్ని పోస్టులను దాదాపుగా ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఏపీపీఎస్సీ తాజా నిర్ణయంతో అభ్యర్థులకు సన్నద్ధతకు సమయం పెరగడంతోపాటు, ఖర్చు, విలువైన సమయం వృథాకాకుండా నిరోధించవచ్చు. కమిషన్‌కు పరీక్షల నిర్వహణ భారం, ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ ఏక పరీక్షా విధానంలో కేవలం ఆఫ్‌ లైన్‌ ద్వారానే ఒకే షిఫ్టులో నిర్వహిస్తారు. ఆన్‌ లైన్‌ ద్వారా నిర్వహించే పరీక్షలకు ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.వెయ్యి వరకు ఖర్చువుతోంది. ఆఫ్‌ లైన్‌ ద్వారా అయితే ఖర్చుకు చెక్‌ పెట్టొచ్చని కమిషన్‌ నిర్ణయించింది. కాగా ఇటీవల జారీ చేసిన ఫారెస్టు బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ అనుసరించి ఇప్పటివరకు 47వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటి సంఖ్య లక్షకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.