NewsTelangana

కాంగ్రెస్‌కు క్యాన్సర్‌ సోకింది… బీజేపీలోకి కాంగ్రెస్‌ నేత

తెంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి పార్టీ మార్పుపై కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయనే స్వయంగా స్పష్టత నిచ్చారు.  కాంగ్రెస్‌ పార్టీకి క్యాన్సర్‌ సోకింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ క్యాన్సర్‌తో భాధపడుతోందని, ఇప్పట్లో ఆ క్యాన్సర్‌ నయమయ్యే సూచనలు కనిపించడం లేదని అన్నారు. అందుకే ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ వీడాల్సి వస్తోందని వెల్లడించారు. తనతో పాటు మరికొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా బయటికి వస్తున్నట్లు తెలిపారు.

మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి తీరు సరిగా లేదని, మునుగోడు ఉప ఎన్నికను ఎంతో తేలిగ్గా తీసుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అందుకు రేవంత్‌దే బాధ్యత అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు. బీజేపీ నేత డీకే అరుణ, తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి నిన్న ఢిల్లీలో అమిత్‌ షాతో శశిధర్‌ రెడ్డి భేటీ అయ్యారు. బీజేపీ పార్టీలోకి వచ్చేందుకు అమిత్‌ షా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.