AI తో ప్రచారానికి సిద్ధమైన తలైవి, కరుణానిధి
తమిళ ప్రజలు భక్తిగా పురుచ్చి తలైవి ( నడిచే దేవత ) అని పిలుచుకునే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత గొంతు విని ఆశ్చర్యపోయారు. ఈ లోక్సభ ఎన్నికలలో ఆమె అన్నాడీఎంకే పార్టీ తరపున ప్రచారం చేయడమే దీనికి కారణం. అలాగే కలైంజర్ అని పిలుచుకునే దివంగత ముఖ్యమంత్రి కరుణా నిధి కూడా తమ పార్టీ డీఎంకే తరపున ప్రచారం చేస్తున్నట్లు, తన కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ గొప్పతనాన్ని తెలియజేస్తూ మాట్లాడుతున్నట్లు ఆడియోలు సృష్టించబడ్డాయి. కృత్రిమ మేధ సాయంతో ఈ ఆడియో క్లిప్లను రూపొందించి ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. జయలలిత ఆడియోలో మీ వల్లే ఇక్కడ ఉన్నా, మీకోసమే పనిచేస్తా అంటూ తన పాపులర్ డైలాగ్ మాట్లాడారు. ఈ ఎన్నికలలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి మద్దతు నివ్వాలని ప్రజలను కోరారు. ఓటర్లను ఆకర్షించడానికే దివంగత నేతల ఆడియోలను రూపొందిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ సాయంతో ఇదంతా చేస్తున్నా, ఇది మితిమీరితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఇదే విధంగా జీవించి ఉన్ననాయకుల వీడియోలను కూడా రూపొందించి ఓటర్లను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. దీనితో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఆందోళన వ్యక్తం చేశారు.