జగదీప్ ధన్ ఖడ్ ఎక్కడున్నారో చెప్పండి : సంజయ్ రౌత్
అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఎక్కడున్నారో చెప్పాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ లేఖ రాశారు. ధన్ ఖడ్ను తాము చేరుకోలేకపోతున్నామని, ఆయన ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రాజీనామా చేసినప్పటి నుంచి ధన్ ఖడ్ గురించి ఎలాంటి సమాచారం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన భద్రతపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ధన్ఖడ్కు ఏం జరిగింది..? ఆయన క్షేమంగానే ఉన్నారా? ఆరోగ్యంగానే ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ ఎంపీలు ప్రయత్నించినట్లు చెప్పారు. కానీ, ఆయన్ని చేరుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ఆయన ప్రస్తుత లొకేషన్ ఏంటి? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది?వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని లేఖలో సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నిర్ణయం అందరినీ షాక్ కు గురి చేసింది. ధన్ ఖడ్ రాజీనామాపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాజీనామా తర్వాత నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. ఆయన్ని సంప్రదించలేకపోతున్నారు. దీంతో ‘జగదీప్ ధన్ ఖడ్ ఎక్కడ..?’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.