కుమ్ముదుమ్ముగా తెలంగాణా రాజకీయం
తెలంగాణ రాజకీయం ఆగమాగమౌతోంది.బీఆర్ ఎస్ వరుస ఆందోళనలతో రేవంత్ సర్కార్కి కంటి మీద కునుకు లేకుండా పోతుంది.పోనీ ఏదో కేసులో ఇరికించి జైలుకి పంపుదామంటే అధిష్టానం అడ్డొస్తుంది.మరో వైపు కేటిఆర్ రెచ్చగొడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రేవంత్ సర్కార్ ఉండిపోయింది. ఈ నేపథ్యంలో కేటిఆర్ ఆధ్వర్యంలో బుధవారం మరో నిరశనకు ఉపక్రమించారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ ,మండలికి ఆటోల్లో వెళ్లి వినూత్నంగా నిరశన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చిందని ఆ హామీలు ఏవీ అమలు కాలేదని విమర్శించారు. ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేటిఆర్ తెలిపారు.గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను అందించామని , అయినా ఈ ప్రభుత్వానికి దున్న పోతు మీద వాన పడ్డట్లే ఉందని ఎద్దేవా చేశారు.ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలను వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారం రోజుల్లో మళ్లీ ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.