యేసు దయ వల్లే కరోనా తగ్గిందన్న వ్యాఖ్యలపై శ్రీనివాసరావు వివరణ..
దేశంలో యేసు దయ వల్లే కరోనా తగ్గిందంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే.. శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలపై వివరణనిచ్చారు. మనం చేసిన సేవల వల్ల కరోనా తగ్గలేదని, కేవలం ఏసు ప్రభువు కృప వల్లే కరోనా తగ్గిందని ఆయన అన్నారు. మన దేశానికి ఆధునిక వైద్యాన్ని, విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులేనని చెప్పారు. క్రైస్తవులతోనే దేశం అభివృద్ధి చెందిందని, క్రైస్తవులు లేకపోతే ప్రపంచ దేశాల్లో భారత్ మనుగడ సాగించేది కాదని అన్నారు. కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో, ఆయన తప్పు సరిదిద్దుకునే పనిలో పడ్డారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి వివాదాన్ని సృష్టించాయని అసహనం వ్యక్తం చేశారు.