గుంటూరులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కావాలి..!
కేంద్ర న్యాయ శాఖ మంత్రిని కోరిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పదోన్నతులు, పెన్షన్ సమస్యలు, బకాయిలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకునేందుకు రాజ్యాంగబద్ధంగా ఉన్న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజును నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు కోరారు. ఈ మేరకు గురువారం కేంద్రమంత్రిని ఢిల్లీలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం క్రింద పబ్లిక్ సర్వీసెస్, పోస్టులకు నియమించబడిన వ్యక్తుల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తోందని, దీని ద్వారా 91.18% పరిష్కారాలు అయ్యాయని.. ఎంతో ప్రాధాన్యత ఉన్న దీనిని ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్ర ప్రదేశ్లో ఇప్పటికీ క్యాట్ బెంచ్ లేదని ప్రస్తుతం, హైదరాబాద్ లో ఉన్న బెంచ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సేవలు అందిస్తోందని కానీ ఆంధ్రప్రదేశ్లోనే 50,000 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని ఇందులో సర్వీస్లో, రిటైర్డ్ అయిన వారున్నారని,రిటైర్డ్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో క్యాట్ బెంచ్ లేకపోవడం వల్ల తమ సమస్యలపై పోరాడటానికి హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తోందని అంతర్-రాష్ట్ర ప్రయాణం చాలా మంది పిటిషనర్లకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని, బాధిత ఉద్యోగులకు సత్వర న్యాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో శాశ్వత క్యాట్ బెంచ్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అనేక ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేశాయని, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు నిలయంగా ఉందని ఇది సీఏటీ బెంచ్ స్థాపనకు తగిన ప్రదేశమని వివరించారు. హైదరాబాద్లోని సీఏటీ బెంచ్లో న్యాయవ్యవస్థ సభ్యులు, ఎక్కువగా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, రిటైర్డ్ ఐఏఐస్ అధికారి వంటి అడ్మినిస్ట్రేటివ్ సభ్యులు ఉంటున్నారని చాలా సార్లు, ఈ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయని తద్వారా కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని మంత్రికి ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు వివరించారు.