కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్ ఫోటో వివాదం..
కర్ణాటకలో మరోసారి సావర్కర్ వివాదం తెరపైకి వచ్చింది. అసెంబ్లీ హాల్లో వీర్ సావర్కర్ ఫోటో పెట్టడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తమను సంప్రదించకుండా వివాదాస్పద వ్యక్తి ఫోటోను ఎలా పెడతారని మండిపడింది. ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ బయట ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అవినీతిపై తాము ప్రశ్నలు లేవనెత్తుతామని ప్రభుత్వానికి తెలుసునని, అందుకే సభా కార్యకలాపాలు జరగకుండా కావాలనే వీర్ సావర్కర్ ఫోటో పెట్టారని డీకే శివకుమార్ ఆరోపించారు. ఇది చూసి తాము ఆందోళనలకు దిగుతామని బీజేపీకి తెలుసునని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఆయన ఫోటోను అసెంబ్లీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సావర్కర్పై తప్పుడు ప్రచారాన్ని పోగొట్టేందుకు తాము రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీజేపీ చెబుతోంది. ఆయన గౌరవార్థమే అసెంబ్లీ ఫోటో పెట్టినట్లు పేర్కొంది.

