గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు విడుదల చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ గెస్ట్ లెక్చరర్ల కు గత 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్’ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు చెల్లించలేదని ఆరోపించారు. జీతాలు అందక వారంతా ఉద్యోగాలు మానేసే పరిస్థితి వచ్చిందని ఇది చాల దుర్మార్గమని ధ్వజమెత్తారు.
బతుకమ్మ, దసరా పండుగలు కూడా జరుపుకోకుండా లెక్చరర్లు పస్తులు ఉండేలా చేసిన పాపం ఈ పాపిష్టి కాంగ్రెస్ ప్రభుత్వానిదని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉంటే వారి బతుకులు ఎలా సాగాతాయని, కుటుంబ పోషణ ఎలా అని ప్రశ్నించారు. అధికారులను కలిసి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో.. ఓపిక నశించి గెస్ట్ లెక్చరర్లు కళాశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని తెలిపారు. వాళ్లంతా కాలేజీలకు వెళ్లకపోతే విద్యార్థులకు పాఠాలెవరు చెబుతారు.. సిలబస్ ఎవరు పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
ప్రభ్యుత్వ నిర్లక్ష్యం వల్ల లెక్చరర్లే కాదు, విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందని హరీశ్రావు కామెంట్ చేశారు. పాఠాలు చెప్పే గురువులకే గౌరవం ఇవ్వని సర్కార్.. ఇక విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తుందని ఎద్దేవా చేశారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని గెస్ట్ లెక్చరర్ల వేతనాల పరిస్థితి ఇంకెంత దారుణమో ఊహించుకోవచ్చని అన్నారు. రేవంత్ రెడ్డి గారూ.. కోతలు కోయడం ఆపేసి, ఉద్యోగులకు జీతాలు చెల్లించడంపై దృష్టి సారించండి. మీ సొంత జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల వేతనాలు వెంటనే విడుదల చేసి మీ పరువు కాపాడుకోండని హరీశ్ రావు ట్వీట్ చేశారు.