ఈ నెల 19న మోదీ తెలంగాణ టూర్..
– మోదీ తెలంగాణ పర్యటనలో రూ.7వేల కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
– వందే భారత్ ట్రైన్ ప్రారంభం.. రూ.699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి భూమి పూజ
-రూ. 1,850 కోట్ల వ్యయంతో 150 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 3 జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు భూమి పూజ
-రూ. 521 కోట్ల వ్యయంతో కాజీపేట్ నందు నిర్మించనున్న ‘రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపునకు’ భూమి పూజ
-రూ. 1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ – మహబూబ్నగర్ మధ్య 85 కి.మీ. ల పొడవున నిర్మించిన డబుల్ లైన్ జాతికి అంకితం
-ఐఐటీ హైదరాబాద్ నందు రూ. 2,597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను జాతికి అంకితం
ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 7 వేల కోట్ల పలు ప్రాజెక్టులకు భూమి పూజ చేయడంతోపాటు మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు. 19వ తేదీ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉదయం 10 గంటలకు ప్రతిష్టాత్మక వందేభారత్ ట్రైన్ ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం రూ. 699 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కార్యక్రమాలు పూర్తయిన అనంతరం నేరుగా పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని, రూ. 1850 కోట్ల వ్యయంతో దాదాపు 150 కి.మీ.ల పొడవున తెలంగాణలో చేపట్టనున్న జాతీయ రహదారి విస్తరణ పనులకు, రూ. 521 కోట్ల వ్యయంతో కాజీపేట్ నందు నిర్మించనున్న ‘రైల్వే పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపున’కు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం రూ.1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ మధ్య 85 కి.మీ.ల పొడవైన రైల్వే డబుల్ లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు. IIT హైదరాబాద్ లో రూ. 2,597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.