మన సత్తెనపల్లి అమ్మాయ్ జడ్జి అయ్యిందోచ్!
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన యువతి కృషితో నాస్తిదుర్భిక్ష్యం అనే విధంగా తొలి ప్రయత్నంలో జడ్జి పోస్ట్ పట్టేసింది. పట్టణానికి చెందిన షేక్ కరిముల్లా ,సుజాత దంపతుల ఏకైక సంతానమైన షేక్ రోషన్… చదువుతూనే ఉద్యోగం సాధించింది. 2024 లో విడుదల చేసిన జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకుంది. రోషన్ 1నుంచి 5వ తరగతి వరకు నెల్లూరు లోను,6నుంచి 10 వరకు సత్తెనపల్లి ప్రగతి విద్యాసంస్థల్లో ,ఇంటర్ గుంటూరులో అభ్యసించారు.అనంతరం క్లాట్ లో ర్యాంక్ సాధించటంతో విశాఖ లోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూని వర్సిటీ లో 5 సంవత్సరాల లా విద్యను 2023 లో పూర్తి చేశారు.వెంటనే ఏ.పి బార్ కౌన్సిల్ లో న్యాయవాది గా ఎన్రోల్ అయ్యారు. ఈ క్రమంలో నోటిఫికేషన్ రావడంతో అప్లై చేసి ఉద్యోగం సాధించారు.తండ్రి కరిముల్లా ప్రేవేట్ ఉద్యోగం చేస్తుండగా తల్లి సుజాత సత్తెనపల్లి ప్రధాన జూనియర్ జడ్జి (సివిల్ డివిజన్)కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.తమ కుమార్తె తొలి ప్రయత్నంలోనే ఇలా న్యాయమూర్తిగా ఎంపికవడం పట్ల ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.న్యాయవాదులు,పుర ప్రముఖుల అభినందలు,శుభాకాంక్షలతో ఆ కుటుంబం తడిసి ముద్దైపోయింది.మొత్తం మీద తొలి ప్రయత్నంలోనే జడ్జి జాబ్ సాధించడం అంటే ఆషామాషీ కాదని సత్తెనపల్లి వాసులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు.