దుబాయిలో.. విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసిన అంబానీ
భారత అపర కుబేరుడు , రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేష్ అంబానీ ఏ పని చేసిన దేశంలో అది ఒక సంచలనమే. ఇక ప్రాపర్టీ కొనే విషయానికి వస్తే దేశంలో ఆయనలాగా ఎవరూ కొనుగోలు చేయలేరనే చెప్పాలి. దీనికి గొప్ప నిదర్శనం ముంబైలో ఆయన నిర్మించుకున్న ఇల్లు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది మన భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లల్లో ప్రథమ స్థానంలో ఉంది. అయితే ముకేశ్ అంబానీ తాజాగా విదేశాలలో ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర దాదాపు 80 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.640 కోట్ల వరకు ఉంటుందట. అరబ్ నగరమైన దుబాయిలోని సముద్ర తీరంలో ఈ విలాసవంతమైన విల్లాను అంబానీ కొనుగోలు చేసినట్లు బ్లూమ్బర్గ్ కథనం వెల్లడించింది.

ఇప్పటివరకు దుబాయిలో ఇదే అతి పెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్. ఈ విషయాన్నిఈ ప్రాపర్టీ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు చెప్పినట్లు బ్లూమ్బర్గ్ కథనం స్పష్టం చేసింది. దుబాయిలోని పామ్ జుమైరాలో ఉన్న ఈ విల్లాను ముకేశ్ అంబానీ ఈ ఏడాది ఆరంభంలోనే కొనుగోలు చేశారట. అయితే ఇది తన చిన్న కుమారుడు అనంత్ కోసం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇది ప్రైవేటు డీల్ కావడంతో ఆయన దీన్ని గోప్యంగా ఉంచినట్లు బ్లూమ్బర్గ్ కథనం పేర్కొంది. భారత స్థానిక కథనాలు కూడా అంబానీ పేరును వెల్లడించకుండా భారత బిలియనీర్ అని పేర్కొనడం గమనార్హం. ఈ డీల్ను రిలయన్స్ ఆఫ్షోర్ సంస్థల్లో ఒకటి రహస్యంగా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విల్లాను తమ అభిరుచికి తగ్గట్టుగా మార్చేకునేందుకు, భద్రత కోసం అంబానీలు భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నారట. చూడటానికి చెట్టు ఆకారంలో ఉండే ఈ పామ్ జుమైరా ..దుబాయిలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన దీవుల సముదాయం. ఈ ప్రాంతంలోనే ఓ బీచ్ సైడ్ లగ్జరీ విల్లాను అంబానీ కొనుగోలు చేశారు. ఈ విల్లాలో మొత్తం 10 బెడ్రూమ్స్, ప్రైవేటు స్పా,ఇండోర్, అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ విల్లాకు సమీపంలోనే బ్రిటిష్ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్,ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నివాసాలు ఉన్నాయి.