పడవ మునిగి 90 మందికి పైగా మృతి
ఆఫ్రికా దేశమైన మొజాంబిక్లో పడవ మునిగి 90 మందికి పైగా మృతి చెందారు. కేవలం కలరా భయంతో పడవలో ప్రయాణమై మృతి చెందిన వైనం.
మాపుటో: సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ పడవ మునగడంతో సుమారు 90 మందికి పైగా మృతి చెందారు. ఈ సంఘటన ఆఫ్రికా దేశమైన మొజాంబిక్లో జరిగింది. ప్రమాద సమయంలో పడవలో 130 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికార యంత్రాంగం పేర్కొంది. ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారిక సమాచారం. మృతుల్లో ఎక్కువమంది చిన్నపిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుండి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళుతుండగా ఈ పడవ మునిగిందని తెలిసింది. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన మొజాంబిక్లో గత అక్టోబర్ నుండి ఇప్పటివరకు 15,000 కలరా కేసులు నమోదవగా, 32 మంది చనిపోయినట్లు ప్రభుత్వ నివేదికలు పేర్కొన్నాయి.