సీబీఐ అంటే మోదీకే నమ్మకం లేదు.. కేటీఆర్ ట్వీట్
బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల వార్ కొనసాగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని కేటీఆర్ విమర్శలు చేశారు. 10 ఏళ్ల కిందట.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో.. గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ చేసిన ట్వీట్ను తెరపైకి తీసుకొచ్చారు. “కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా సీబీఐ మారిపోయింది. ఆ సంస్థపై దేశం విశ్వాసం కోల్పోయింది. సీబీఐతో భయపెట్టాలని చూడొద్దని కేంద్రానికి స్పష్టం చేస్తున్నా” అని ట్వీట్లో మోదీ పేర్కొన్నారు. దీనిపై ట్వీట్ చేసిన కేటీఆర్… “సీబీఐ లాంటి కేంద్ర సంస్థలపై దేశానికి ఎందుకు నమ్మకం లేదు? ఎందుకంటే గౌరవనీయులైన ప్రధాన మంత్రిగారే సీబీఐని నమ్మరు కాబట్టి!” అని ఎద్దేవా చేశారు.