ప్రవళిక కుటుంబసభ్యులను కలిసిన మంత్రి కేటీఆర్ ..అండగా ఉంటామని భరోసా
ఇటీవల హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన యువతి మర్రి ప్రవళిక కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్ ను నేడు కలిశారు. ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేటీఆర్ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రవళిక తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్ తో తమ ఆవేదన పంచుకున్నారు. ప్రవళిక మరణానికి శివరామ్ అనే వ్యక్తి కారణం అని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు మంత్రిని కోరారు. మా కూతురు మృతికి కారణమైన శివరాంకి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. మంత్రి కేటీఆర్ ప్రవళిక కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి భరోసా ఇచ్చారు. కాగా ఆయన మాట్లాడుతూ.. ప్రవళిక మరణం చాలా దురదృష్టకరమనన్నారు. ఈ బాధాకర సమయంలో ప్రవళిక కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కేటీఆర్ కోరారు.ఈ సంఘటనకు సంభందించిన అన్ని వివరాలు డీజీపీతో మాట్లాడిన కేటీఆర్, విచారణను మరింత వేగంగా పూర్తి చేయాలని కోరారు. ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన భరోసా కి ప్రవళిక కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.


 
							 
							