కల్యాణమస్తు పథకంపై మంత్రి బొత్స క్లారిటి
ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకంపై ప్రతిపక్షాలు కావాలనే విషం చిమ్ముతున్నాయని మంత్రి బొత్స మండిపడ్డారు. జగన్ సర్కార్ కొత్తగా వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకం అమలుకు శ్రీకారం చుట్టిందని, ఈ పథకం ద్వారా గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెట్టింపు సాయాన్ని సీఎం జగన్ ఇస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు. నిరక్ష్యరాస్యతను రూపుమాపే చర్యల్లో భాగంగానే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలనే నిబంధన పెట్టామని మంత్రి బొత్స వివరించారు.

అక్టోబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందన్నారు. పేదలకు సాయం చేసే కల్యాణమస్తు పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పేరుతో మరో కొత్త పథకాన్నిఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి ఈ పథకం ద్వారా ఆర్థికసాయం చేయనున్నారు. కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 98 శాతం హామీలను అమలు చేసినట్లు అవుతుందన్నారు బొత్స తెలిపారు.

