కర్ణాటక ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ.. ఏ పార్టీకి జేడీఎస్ మద్దతు
రేపు జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే.. పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా.. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్గా మారనుంది. జేడీఎస్ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తమతో సంప్రదింపులు జరిపాయని చెప్పారు. ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో తాము ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నామని.. సరైన సమయంలో ప్రజలకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని పేర్కొన్నారు. మరోవైపు జేడీఎస్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. బీజేపీ నేత శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. జేడీఎస్ను బీజేపీ సంప్రదించలేదని అన్నారు. బీజేపీ క్లియర్ మెజార్టీ వస్తుందన్నారు. క్షేత్ర స్థాయి నుంచి తమ కార్యకర్తలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తాము ఈ విషయాన్ని చెపుతున్నామని వెల్లడించారు.